సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. 390 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన టీంఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్లో రాణించినా బౌలర్ల వైఫల్యం కారణంగా భారత్కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లను ఆడుకున్న కంగారూలు మొదటి వన్డేకంటే మరో 15 పరుగులు ఎక్కువే చేశారు. కానీ టార్గెట్ ఛేజింగ్లో కెప్టెన్ కోహ్లీ, కేఎల్ రాణించినా.. మరోసారి ఓపెనర్లు నిరాశ పరచడంతో ఓటమి తప్పలేదు. దీంతో సిరీస్ కూడా చేజారింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఓపెనర్లు అద్భుత ఆరంభాన్నించ్చారు. డేవిడ్ వార్నర్(77 బంతుల్లో 83), ఆరోన్ ఫించ్(69 బంతుల్లో 60) అర్థ సెంచరీలతో రాణించారు. ఫించ్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(64 బంతుల్లో 104) మరో సెంచరీతో అదరగొట్టాడు. ఆ తరువాత లబుషేన్(61 బంతుల్లో 70) కూడా స్మిత్కు చక్కటి సహకారం అందించారు. ఈ క్రమంలోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివర్లో మ్యాక్స్వెల్(29 బంతుల్లో 63) మరోసారి భీకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆసీస్ 4 వికెట్లకు 389 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లంతా మూకుమ్మడిగా పరుగులు సమర్పించుకోవడంతో ఆసిస్ రికార్డు స్కోరు సాధించింది. ఇప్పటివరకు భారత్పై ఆసీస్కు ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో షమి, పాండ్యా, బూమ్రాలకు తలో వికెట్ తక్కింది.