అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : టీపీసీసీ పిలుపునిచ్చిన ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో ఆదివారంనాడే పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి నుంచే మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నివాసం వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. తెల్లవారు జామున రేవంత్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం పది గంటల తర్వాత రేవంత్ అనుచరులు ఒక్కొక్కరుగా వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీ షర్ట్, జీన్స్ ప్యాంట్, రన్నింగ్ షూతో రేవంత్ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నారు. అనుచరులు ఎప్పట్లా సాధారణంగానే ఉన్నారు. దాంతో, పోలీసులు కాస్త రిలాక్స్ అయ్యారు. ఇదే అదనుగా రేవంత్ మెరుపు వేగంతో బయటకు వచ్చారు. అడ్డుకోబోయిన పోలీసులను అనుచరులు 15 సెకన్లపాటు నిలువరించారు. పరుగులు తీసుకుంటూ రేవంత్ పెద్దమ్మ దేవాలయం వెనక రోడ్డు వరకు వచ్చారు. అప్పటికే అక్కడ ద్విచక్ర వాహనంతో అనుచరుడు సిద్ధంగా ఉన్నాడు. రేవంత్ దానిపై కూర్చున్నారు. ఓ పోలీసు అడ్డుకున్నా.. అనుచరులు తప్పించారు. అనుచరుడు డ్రైవ్ చేస్తుండగా.. ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లిన ఆయన.. హోటల్ కాకతీయ ముందుకు చేరుకున్నారు. అక్కడ ద్విచక్ర వాహనం దిగి డివైడర్ దాటుతుండగా, పోలీసులు అడ్డుకున్నారు. వారిని తోసుకుంటూ వెళ్లి ప్రగతి భవన్ వద్దకు రేవంత్ చేరుకున్నారు. గేటును టచ్ చేశారు. సరిగ్గా ప్రగతి భవన్ ముఖద్వారం ముందు నిలబడి పెద్దఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే అక్కడున్న పోలీసులు రేవంత్ను అరెస్టు చేసి కామాటిపురా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్.. ‘కేసీఆర్ నశించాలి.. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి’ అని నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడికి టీపీసీసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులకు రేవంత్ చుక్కలు చూపించారు. ఇక, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రగతి భవన్ దాకా వచ్చి అరెస్టయ్యారు. కాగా.. ఎన్ఎ్సయూఐ, యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలూ ప్రగతిభవన్ సమీపం వరకూ వచ్చి ముట్టడించే ప్రయత్నం చేశారు. వారందరినీ అరెస్టు చేశారు.
గృహ నిర్బంధాలు.. అరెస్టులు
ముట్టడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. భట్టి విక్రమార్క, జానారెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం, సంపత్కుమార్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి తదితరులను గృహ నిర్భంధం చే శారు. సోమవారం తెల్లవారుజామునే వివిధ జిల్లాల్లో వందలాదిమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్కు వచ్చే మార్గంలో వేలాదిమంది పోలీసులను మోహరించారు. అయినా, కొందరు పోలీసుల కళ్లుగప్పి ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ప్రగతి భవన్వైపు దూసుకొచ్చారు.
ప్రగతి భవన్ను బద్దలు కొట్టుడు ఖాయం: రేవంత్రెడ్డి
ఇప్పుడు ప్రగతి భవన్ను టచ్ చేశామని, సీఎం కేసీఆర్ తన నియంతృత్వ పోకడలను వీడకుంటే 4 కోట్లమంది ప్రజలు ప్రగతి భవన్ను బద్దలు కొట్టుడు ఖాయమని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ని ప్రజలు త్వరలో ఇంటికి పంపిస్తారన్నారు. కార్మికులు చనిపోతున్న నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలను పిలిచి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికులు తీసుకునే ఏ నిర్ణయానికైనా కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ‘‘కార్మికులకు వేతనాలు ఇవ్వాలని హైకోర్టు చెబితే.. సంస్థ దగ్గర రూ.7 కోట్లు మాత్రమే ఉన్నాయని, వేతనాలకు రూ.230 కోట్లు కావాలని బుకాయించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. మొత్తం 18 రకాల పాసులను ఉచితంగా ఇస్తున్న ప్ర భుత్వం.. వాటికిగాను ఏటా రూ.700 కోట్ల చొప్పున మూడేళ్లలో రూ.2100 కోట్ల మేరకు ఆర్టీసీకి బకాయి పడింది. ఈ మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లిస్తే వేతనాలు ఇవ్వడమే కాకుండా ఇంకా రూ.1800 కోట్లు మిగులుతాయి’’ అని చెప్పారు. కోర్టు చెప్పినా వినే పరిస్థితుల్లో ప్రభు త్వం లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘భాగో తెలంగాణ’ పేరిట కేసీఆర్ను తరిమేదాకా ఊరుకోబోమని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అరెస్టులతో కాంగ్రె స్ నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
రేవంత్పై కేసు నమోదు
పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా రేవంత్ రెడ్డిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించగా, అనుచరుల సహకారంతో రేవంత్ ప్రగతి భవన్కు చేరుకున్నారు. దాంతో, ఎస్సై నవీన్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు రేవంత్తోపాటు అనుచరులపై ఐపీసీ 351, 353, 332 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
tags : pragathibhavan, revanth, rtc strike