ఉదయం 11 గంటలకు
ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
★ ప్రపంచ నలుమూలల నుంచి
30 వేల మంది హాజరు
★ ఫార్మారంగం అభివృద్ధి,
ఆరోగ్యరంగంపై కీలక చర్చలు
★ జీవశాస్త్ర పరిశోధనలు,
ఆవిష్కరణలపై ఉపన్యాసాలు
★ పెట్టుబడులను ఆకర్షించేందుకు
ప్రభుత్వం కృషి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్ వేదికగా ఏటా నిర్వహించే బయోఏషియా సదస్సుకు ఈ ఏడాది ‘మూవ్ ద నీడిల్’ అనే థీమ్ను ఎంపికచేశారు. ప్రపంచం నలుమూలల నుంచి 30 వేల మంది వివిధ రంగాల నిపుణులు పాల్గొంటున్నారు. ఈ ఏడాది సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా-2021 సదస్సు సోమవారం ప్రారంభం అవుతున్నది. రెండురోజులపాటు వర్చువల్గా నిర్వహించే సదస్సును ఉదయం 11గంటలకు హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభిస్తారు. సదస్సులో జీవ శాస్ర్తాల పరిశోధనల్లో ప్రగతి, ఆరోగ్య పరిరక్షణ, ఔషధరంగం అభివృద్ధి, కరోనా తదనంతర సవాళ్లను ఎదుర్కోవటంలో ఫార్మారంగం పాత్ర తదితర అంశాలపై నిపుణులు లోతైన చర్చలు జరుపనున్నారు. హైదరాబాద్ వేదికగా ఏటా నిర్వహించే బయోఏషియా సదస్సుకు ఈ ఏడాది ‘మూవ్ ద నీడిల్’ అనే థీమ్ను ఎంపికచేశారు. 18వసారి నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 30 వేల మంది వివిధ రంగాల నిపుణులు పాల్గొంటున్నారు. భిన్న అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు, ప్యానల్ చర్చలు కొనసాగుతాయి. ఈ ఏడాది సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, డబ్ల్యుహెచ్వో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. ఔషధ తయారీరంగంలో రాష్ర్టాన్ని ప్రపంచానికే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తున్నది.
22 తేదీ సదస్సు షెడ్యూల్
———————————————–
ఉదయం 11గంటలకు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సదస్సును ప్రారంభిస్తారు. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, సంయుక్త ఎండీ సుచిత్రా ఎల్లాకు జీనోమ్వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీశ్రెడ్డి, బయోఏషియా సీఈవో, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొంటారు.
మధ్యాహ్నం 3 గంటలకు సెంటర్ ఫర్ బయాలాజిక్ ఎవల్యూషన్ అండ్ రీసెర్చ్ (సీబీఈఆర్), ఎఫ్డీఏ డైరెక్టర్ డాక్టర్ పీటర్ మార్క్స్ కీలకోపన్యాసం ఉంటుంది.
4 గంటలకు ఆరోగ్య పరిరక్షణపై ప్యానల్ చర్చ ఉంటుంది. హాలెండ్లోని లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్కు చెందిన కార్మెన్ వాన్ విల్స్టెరెన్, అపోలో హాస్పిటల్స్ సంయుక్త ఎండీ సంగీతారెడ్డి, నాస్కామ్ అధ్యక్షుడు దేబ్జని ఘోష్, ఫోర్టీస్ హెల్త్కేర్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఆషుతోశ్ రఘువంశీ, ఈఐ ఇండియా హెల్త్కేర్ పార్ట్నర్ కైవాన్ మోదవాలా తదితరులు చర్చలో పాల్గొంటారు.
5 గంటలకు ఇమ్యునైజింగ్ ది వరల్డ్ అనే అంశంపై ప్యానల్ చర్చ ఉంటుంది. డబ్ల్యూహెచ్వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి బల్రామ్ భార్గవ, యూనిసెఫ్ ముఖ్య సలహాదారు, చీఫ్ ఆఫ్ ఇమ్యునైజేషన్స్ రోబిన్ నందీ, దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ జేరోమ్ హెచ్ కిమ్, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, బయాలాజికల్ ఈ (బీఈ) ఎండీ మహిమాదాట్ల తదితరులు ఈ చర్చలో పాల్గొంటారు.
6 గంటలకు కొవిడ్-19పై ప్యానల్ చర్చలు ఉంటాయి. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ (గ్లోబల్ హెల్త్) ప్రెసిడెంట్ డాక్టర్ ట్రివర్ ముండెల్ ప్రత్యేక ఉపన్యాసం ఉంటుంది. చర్చల్లో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, కేంద్ర బయోటెక్నాలజీశాఖ కార్యదర్శి రేణు స్వరూప్, డబ్ల్యూహెచ్వో సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతీయ సంచాలకులు పూనమ్ ఖేత్రపాల్సింగ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కంట్రోలర్ జనరల్ వీజీ సొమాని పాల్గొంటారు.
23వ తేదీ షెడ్యూల్
———————————————–
ఉదయం 10.45కు మాన్యుఫ్యాక్చరింగ్ డివిజన్ ప్రెసిడెంట్ సనత్ ఛటోపాధ్యాయ కీలకోపన్యాసం ఉంటుంది.
11.00 గంటలకు ‘సైప్లె చైన్లో ఇబ్బందులు-పరిష్కారం’ అనే అంశంపై ప్యానల్ చర్చ చేపడుతారు. ఇందులో జైడస్ కాడిలా సైప్లె చైన్ హెడ్ గౌరవ్ సుచక్, సిప్లా గ్లోబల్ సైప్లె హెడ్ స్వప్న్ మల్పానీ, సన్ ఫార్మా సైప్లె చైన్ గ్లోబల్ హెడ్ శ్రీనివాసరావు, బయోకాన్ లిమిటెడ్ సైప్లె చైన్ గ్లోబల్ హెడ్ ప్రసాద్ దేశ్పాండే తదితరులు పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.10కు ‘మెడికల్ టెక్నాలజీస్-భారత్కు తదుపరి గొప్ప అవకాశం’ అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ ఉంటుం ది. కేంద్ర ఫార్మాస్యూటికల్స్శాఖ కార్యదర్శి ఎస్ అపర్ణ, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంయుక్త డ్రగ్స్ కంట్రోలర్ ఎస్ ఈశ్వర్రెడ్డి తదితరులు చర్చలో పాల్గొంటారు.
1.30కు ‘క్రియేటింగ్ యూనీకార్న్స్’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసాలు ఉంటాయి. నోవార్టీస్ మాజీ సీఎఫ్వో, ఎంఎం దిల్లన్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ బికర్స్టాఫ్, వీఐబీ సీఈవో జో బరీ తదితరులు ప్రసంగిస్తారు.
2.45కు హెల్త్కేర్ టు హిట్ రిఫ్రెష్ అంశంపై చర్చ ఉంటుంది.
3 గంటలకు ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ టు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ హబ్పై సమావేశం ఉంటుంది. రాష్ట్ర పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా, పిరమల్ గ్రూప్ వైస్ చైర్పర్సన్ స్వాతి పిరమల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీశ్రెడ్డి, లూపిన్ ఎండీ నీలేశ్గుప్తా, ఈవై ఇండియా లైఫ్ సైన్సెస్ లీడర్ శ్రీరామ్ శ్రీనివాసన్ పాల్గొంటారు.
4.05కు కొవిడ్ అనంతరం పరిశోధన, అభివృద్ధి-సహకారం, పునరావృతంపై చర్చ ఉంటుంది. టాకెడా ఆర్అండ్డీ ప్రెసిడెంట్ అండ్రూ ప్లంప్, నోవార్టీస్ కార్పోరేట్ వ్యవహారాల హెడ్ లుట్జ్ హెగెమన్ తదితరులు పాల్గొంటారు.
4.45కు సదస్సు ముగింపు సమావేశం ఉంటుంది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బల్రామ్ భార్గవకు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ ఎఫ్ఏబీఏ ప్రత్యేక పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా
———————————————–
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు బయోఏషియా సదస్సును వేదికగా మలుచుకోవాలని రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది. కరోనా టీకాను అభివృద్ధి చేయటం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ రాష్ట్రం.. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. జీవ శాస్ర్తాల్లో పరిశోధనలు, ఔషధ తయారీరంగంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపాలన్న పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సంకల్పానికి ఈ సదస్సు బలాన్నిస్తుందని అధికారవర్గాలు అంటున్నాయి. కరోనాపై పోరులో తెలంగాణ కృషిని ప్రధాని స్వయంగా ప్రశంసించారు. 60 దేశాల ప్రతినిధులు హైదరాబాద్లోని భారత్ బయోటెక్లో కొవాగ్జిన్ టీకా తయారీ ప్రక్రియను పరిశీలించి కొనియాడారు. ఔషధ తయారీరంగంలో ప్రగతి కోసం రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్కు, ముచ్చర్లలో ఫార్మా సిటీ, లైఫ్ సైన్సెస్కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో జీనోమ్ వ్యాలీని ఏర్పాటుచేస్తున్నారు.
వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు దేశవిదేశీ ఔషధ తయారీ, పరిశోధన సంస్థలను ఆకర్షించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసింది. 250 ఎకరాల్లో ఏర్పాటైన మెడికల్ డివైస్ పార్కులో పలు సంస్థలకు కంపెనీల స్థాపనకు భూమిని కేటాయించారు. ఇంకా అనేక కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఫార్మాసిటీకి ఇప్పటికే 10 వేల ఎకరాల భూసేకరణ పూర్తికాగా, పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. త్వరలోనే కంపెనీలకు భూమిని కేటాయిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్, ఔషధ, పరిశోధనరంగ సంస్థ ప్రముఖులు సదస్సులో పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకుగల అవకాశాలను వారికి వివరించేందుకు మంచి అవకాశమని ప్రభుత్వం భావిస్తున్నది.