అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: యువ కథానాయకుడు నిఖిల్ కోసం అగ్ర కథానాయకుడు చిరంజీవి అతిథిగా రాబోతున్నారు. దర్శకుడు టి.ఎన్. సంతోష్ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. చాలా రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నవంబరు 26న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరవుతున్నారు.
ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ‘గ్యాంగ్లీడర్’ చిత్రంలోని ‘చెయ్యి చూశావా ఎంత రఫ్గా ఉందో..’ అనే డైలాగ్ చెప్పుకుంటూ పాఠశాల మొత్తం తిరిగేవాడిని. ఇప్పుడు చిరంజీవి సర్ నాతో కరచాలనం చేయడం, నా చిత్ర వేడుకకు రావడం ఆశ్చర్యంగా ఉంది’ అని పేర్కొన్నారు.