లౌక్య న్యూస్ : లోక్సభ ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఆస్త్రాన్ని ప్రయోగించారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల ప్రజలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించటం ద్వారా ప్రతిపక్షాలను స్వీయరక్షణలో పడవేశారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉండటం.. ఐదెకరాలు అంతకంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగివున్నవారు.. మున్సిపాలిటీల్లో రెండు వందల గజాల కంటే తక్కువ నివాస స్థలం ఉన్న అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తారు. అందుకు రాజ్యాంగాన్ని సవరించేందుకు సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల ఆఖరు రోజైన మంగళవారం లోక్సభలో ప్రవేశ పెట్టారు. అయితే అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది. ఈ సవరణ బిల్లును ఆమోదించాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుంది. ప్రస్తుతం బీసీలకు 27 శాతం, ఎస్సీలకు పదిహేను శాతం, ఎస్టీలకు ఏడున్నర శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీనికి ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించటం వలన మొత్తం 60 శాతానికి చేరుకుంటాయి. మిగతా నలభై శాతం సీట్లను ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఈ పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. దేశంలోని కోట్లాది మంది వెనకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లకు ఎలాంటి భంగం కలగకుండా అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తారు. మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించినప్పడు అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయటం తెలిసిందే. పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోఅగ్రవర్ణాల వారికి పది శాతం సీట్లు రిజర్వు చేసేందుకు ఒక ప్రయత్నం జరిగింది. అయితే నరసింహారావు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్ని సుప్రీం కోర్టు కొట్టివేయటంతో ఆ ప్రతిపాదన వీగిపోయింది. రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదనే సిద్ధాంతానికి ఇది విరుద్ధమంటూ సుప్రీం కోర్టు అప్పట్లో నరసింహారావు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని తోసిపుచ్చింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, రిపబ్లికన్ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె కూడా చాలాకాలం క్రితం ఉన్నత వర్గాలవారికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయటం తెలిసిందే. ఈ నేపద్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొవడం సంచలనం స్రుష్టిస్తోంది.. అయితే ఈ రిజర్వేషన్లు మతంతో సంబంధం లేకుండా అగ్రవర్ణాల్లోని బీద వారందరికీ వర్తిస్తాయా? లేదా అనేది వివరాలు తెలియాల్సి ఉంది.. మరోవైపు కాంగ్రెస్ సైతం రిజర్వేషన్ లకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. అయితే గతంలో ఆ రోజు పీవి వేసిన బాటను ఈ రోజు మళ్లీ తెర పైకి రావడం.. అదే అస్త్రంతో మోది ప్రతిపక్షాల ను ఇరకాటంలో పెట్టినట్లందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
